చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచి మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై కూడా సందేహాలు మొదలయ్యాయి. భారత్ తో నిర్వహించే ఐపీఎల్ లో కరోనా ప్రభావంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. మార్చ్ 12, 15, 18 తేదీల్లో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మార్చ్ 29 నుంచి ఐపీఎల్ యథావిధిగా జరుగుతాయని తెలిపాడు. భారత్లో ఎటువంటి ఇబ్బంది లేదని, ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రభావం గురించి చర్చించలేదని చెప్పాడు.
అలాగే ఈ విషయంపై ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందిస్తూ, ఐపీఎల్కు కరోనా ప్రభావం లేదని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం ఐపీఎల్కు ఎటువంటి కరోనా ముప్పులేదు. అయితే పరిస్థితులను బట్టి ఆ అంశంపై కూడా దృష్టిసారిస్తామని బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మార్చి 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.