పి.జనార్దన్రెడ్డి (పీజేఆర్).. హైదరాబాద్ లో ఈ పేరు చాలా మందికి యాదుంటది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయనే పెద్ద దిక్కు. ప్రజలు మెచ్చిన మాస్ లీడర్. 2007లో పీజేఆర్ గుండెపోటుతో మృతి చెందారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో విష్ణువర్ధన్రెడ్డి ఖైరతాబాద్లో భాగంగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. ఇక.. 2014, 2018 ఎన్నికల్లో అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విష్ణువర్ధన్రెడ్డి ఓటమి చెందారు.
ఓటమి అనంతరం విష్ణవర్దన్ రెడ్డి రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మళ్లీ తిరగడం ప్రారంభించారు. ఇదే తరుణంలో జూబ్లీహిల్స్ తెరపైకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వచ్చారు. వరుసగా నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు. ఓ సందర్భంలో విష్ణువర్ధన్రెడ్డి వర్గీయులు అజారుద్దీన్ పర్యటనను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, హస్తినలో కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదం తనకున్నదని అజారుద్దీన్ చెప్పుకుంటున్నప్పటికీ… ఇక్కడ తెర వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డినే అజారుద్దీన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా పార్టీవర్గాలే చెబుతున్నాయి. విష్ణు, ఆయన వర్గీయులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విష్ణువర్ధన్రెడ్డి ఆయనను కలవనే లేదు. పైగా గతంలో కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ ఎపిసోడ్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని రేవంత్ హోంగార్డుల పోల్చినప్పుడు పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో విష్ణువర్ధన్రెడ్డి, కోమటిరెడ్డికి మద్దతుగా నిలిచి.. మేం హోంగార్డులమే, మాతో ఏం పని? అని కూడా ప్రశ్నించారు. దీంతో అప్పటి నుంచి రేవంత్, విష్ణు మధ్య పెద్ద సత్సంబంధాలేమీ లేవు. అంతేకాదు.. పెద్దమ్మ తల్లి గుడి వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై విష్ణువర్దన్ రెడ్డి కేసు కూడా పెట్టారు.
ఇదిలాఉండగా.. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజారుద్దీన్ ను అధిష్ఠానం ప్రకటించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డే అజారుద్దీన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా పావులు కదుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పీజేఆర్ వారసుడికి చెక్ పెట్టేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి బీజేపీలోకి చేరతారా, స్తబ్దుగా ఉండిపోతారా.. అనేది వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ