ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పూర్వపు వరంగల్ జిల్లా పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎప్పుడూ విచిత్రమే. అక్కడి నేతల చరిత్ర ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే డోర్నకల్ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాల చరిత్ర చూసుకుంటే ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలు నలుగురు మాత్రమే. అదే ఆశ్చర్యం అనుకుంటే ఆ గెలిచిన నలుగురిలో..ప్రతి ఒక్కరూ హ్యాట్రిక్ వీరులే.
సాధారణంగా ఎన్నికలలో ఒకటి రెండు సార్లు గెలిచిన వాళ్లు.. మూడోసారి గెలవాలంటే బోలెడంత అదృష్టంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే క్వాలిఫికేషన్లు చాలానే ఉండాలి. రాజకీయ అపర చాణుక్యుడిగా పేరుపొందిన సీఎం కేసీఆర్..మూడో సారి హ్యాట్రిక్ కొట్టడానికి ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే డోర్నకల్ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం చిత్రం.. విచిత్రం అంటారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఏడు దశబ్దాల రాజకీయ చరిత్రలో ఈ నియోజక వర్గం నుంచి కేవలం నలుగురు మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టగలిగారు.
1957 సంవత్సరంలో డోర్నకల్ నియోజకవర్గానికి మొట్ట మొదటసారిగా ఎలక్షన్స్ జరిగాయి. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నూకల రాంచంద్రరెడ్డి.. 1957 నుంచి 1972 వరకు నాలుగు సార్లు వరుసగా విజయాలు సాధించారు.అందులోనూ 1972 లో జరిగిన ఎన్నికలలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నూకల రాంచంద్రారెడ్డి ఆకస్మిక మరణంతో.. 1974లో ఉప ఎన్నికలు జరిగాయి.
1974లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి చెందిన ..రామసహాయం సురేందర్ రెడ్డి మరోసారి ఏకగ్రవంగా ఎన్నికవడం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది.అంతేకాదు సురేందర్ రెడ్డి కూడా 1974 నుంచి 1985 వరకు వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. అయితే 1989 వ సంవత్సరంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.అలా అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యా నాయక్.. 1989 నుంచి 2004 వరుసగా నాలుగు సార్లు గెలిచి.. 2009 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. అయితే నాలుగు సార్లు గెలిచి.. ఐదోవసారి ఓటమిపాలైన రెడ్యానాయక్ను.. 2014 ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం ఓటర్లు మళ్లీ గెలిపించారు. అలా 2018 ఎన్నికల్లో మరోసారి గెలుపొందిన రెడ్యా నాయక్… డబుల్ హ్యాట్రిక్ విక్టరీని తన ఖాతాలో వేసుకునేలా చేశారు.
నిజానికి డోర్నకల్ నియోజక వర్గ రాజకీయ చరిత్ర.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల వేళ మరోసారి ప్రత్యేక చర్చగా నిలిచింది. ఎందుకంటే ఏడు దశబ్దాల చరిత్రలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు కావడంపై రాజకీయ సర్కిల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మరోవైపు డోర్నకల్ గురించి చెప్పాలంటే..అది ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న రెడ్యానాయక్ను 2009 ఎన్నికలలో ఓడించిన చరిత్ర సత్యవతి రాథోడ్కు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకే పార్టీలోనే ఉన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ..తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. డోర్నకల్ కోటపై మళ్లీ కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగురవేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సారి డోర్నకల్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందా అని సోషల్ మీడియా వేదికగా కూడా చర్చలు జరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ