తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా అందుతున్న నిధులతో దేశంలోని వెనుకబడిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధికి వినియోగిస్తున్నారని మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. శుక్రవారం ఆయన హుజూర్నగర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందని, తనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనించేలా చేస్తున్నారని, ప్రస్తుతం మన తెలంగాణ దేశానికి దిక్సూచీ మాదిరిగా నిలుస్తోందని పేర్కొన్నారు. రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వపర్ ప్లాంట్ను నిర్మిస్తున్నామని, అలాగే పల్లె ప్రగతి ద్వారా మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారని, పనుల దగ్గరకి వచ్చేసరికి మాత్రం చేతులెతేస్తుంటారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో దేశంలోని బలమైన కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయని, అయితే అదే సమయంలో సామాన్య ప్రజలు మాత్రం అగాథంలోకి వెళ్లారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక తెలంగాణ నుంచి వచ్చే నిధులతో వెనుకబడిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధికి వినియోగిస్తున్నారన్న ఆయన, దీనిని అబద్దమని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అందించే నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పేవన్ని అబద్దాలేనన్న కేటీఆర్, ఒకవేళ తాను చెప్పింది నిజమేనని తేలితే కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. న్యాయంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా ఇక్కడి బీజేపీ నేతలు అడగలేరని, వారికి తెలిసింది కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడమేనని ఆరోపించారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని, తెలంగాణ యువత దాని ఉచ్చులో పడొద్దని కేటీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE