కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చ్ 24, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు. కరోనా కట్టడికి కోసం వివిధ జిల్లాల్లో చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36 కు చేరుకున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలుపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించినప్పటికీ చాలా చోట్ల ప్రజలు తమ వాహనాల్లో రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమునట్టు సమాచారం. ఈ సమీక్ష సమావేశం తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి లాక్డౌన్ అంశంపై మరికొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది.