తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి పార్టీల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడటంతో.. మైకులన్నీ మూగబోయాయి. మరోవైపు అభ్యర్థులు ప్రలోభాలలో బిజీ అవగా.. ఈసీ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయింది. ప్రచార గడువు ముగియగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్రాజ్ అన్ని పార్టీలకు ఇక ఎలాంటి ప్రచారాలు చేయొద్దని స్పష్టం చేశారు.
పార్టీలు ఎలాంటి సమావేశాలు కూడా నిర్వహించకూడదని హెచ్చరించారు. స్థానికేతరులు ఉంటే వారంతా నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ప్రచారం చేయకూడదని చెప్పారు. అంతేకాదు టీవీ, రేడియో, కేబుల్ నెట్వర్క్ల్లో ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని వికాస్ రాజ్ చెప్పారు.
మరోవైపు పోలింగ్ సిబ్బంది ఎవరూ కూడా ఈవీఎంల దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తనిఖీలు పారదర్శకంగానే జరుగుతాయని చెప్పిన ఆయన.. కావాలంటే నేతల అనుచరులు మాత్రం స్వయంగా వెళ్లి చూడొచ్చన్నారు. ఇప్పటికే హోం ఓటింగ్ ద్వారా 27,175 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఈ ఎన్నికలలో తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు .
ఇక ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులు ప్రతి పోలింగ్ బూత్లో ఉంటారు. ప్రిసైడింగ్ అధికారులు పీఓ డైరీ, ఫారం-17ఏ, 17 సి పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది. పీఓల వద్ద అధికారులంతా.. సంబంధిత పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితా, ఏఎస్డీ లిస్ట్ కలిగి ఉంటారు.
నవంబర్ 30న పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో.. ఉదయం 5:30 గంటలకు మాక్ పోల్ను నిర్వహిస్తారు. 50 ఓట్లను వేసి వాటిని సీఆర్సీ ద్వారా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చే వీవీ ప్యాట్ స్లిప్లను భద్రపరుస్తారు. అలాగే పోలింగ్ రోజు ఓటర్లు ఎపిక్ కార్డుతో పాటు.. భారత ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ను వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది.
వెంట తీసుకుని రావాల్సిన డాక్యుమెంట్స్
* ఆధార్ కార్డు
* పాన్ కార్డు
* పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్
* కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
* డ్రైవింగ్ లైసెన్స్
* RGI ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు
* ఇండియన్ పాస్ పోర్టు
* ఫోటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగ గుర్తింపు కార్డు
* ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం
* దివ్యాంగుల గుర్తింపు కార్డు
పైన తెలిపిన ఏదైనా ఒక గుర్తింపు కార్డులను వెంట తీసుకొని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు తెలిపారు.
అలాగే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 29 న సంబంధిత డి.ఆర్.సి సెంటర్లకు వెళ్లి ఈవీఎం లను సేకరించుకొని నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. ప్రిసైడింగ్ అధికారులకు తమ చెక్ లిస్ట్ ఆధారంగా.. క్రమపద్దతిలో విధులను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ