తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 9, మంగళవారం నాడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. హైదరాబాద్లో కరోనా వ్యాప్తి దృష్ట్యా సిటీ బస్సు సర్వీసులను వెంటనే ప్రారంభించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ సర్వీసులను కూడా నడపవద్దని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. మరోవైపు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే ఆర్టీసీ బస్సులను నడపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఒప్పందాలకు సంబంధించిన పక్రియను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడిపే విషయంలో ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి ఒప్పందాలే కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఒప్పందాల విషయంలో చర్చలు నడిచినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కిలోమీటర్ల తిరుగుతున్నాయి వంటి అంశాలు పరిశీలించి, ఎలాంటి అసమానతలు లేకుండా సమ ప్రాతిపదిక విధానంలో బస్సులు నడిచే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పక్రియను త్వరగా పూర్తిచేసి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu