తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా వాసాలమర్రి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా ఆ గ్రామంలోని దళిత వాడలో పర్యటించారు. పలు దళితుల కుటుంబాలతో మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే దళిత బంధు పథకం ఉద్దేశాలను వారికీ వివరించారు. దళిత బంధు పథకంపై వారి నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని రైతువేదికలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, గతంలో ఇచ్చిన హామీల అమలు సహా పలు అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటుగా మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పతి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కాగా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించడం ఇది రెండోసారి. మొదటిసారిగా జూన్ 22న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో పర్యటించి గ్రామస్థులు అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలోని సమస్యలపై చర్చించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గ్రామంలో అభివృద్ధి పనులు పరిశీలన, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు మార్లు వాసాలమర్రికి వస్తానని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ