కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రులు ఉదయం పూట నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి అర్జీలను స్వీకరించేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్భార్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. పదేళ్ల తర్వాత తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం స్వయంగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 55 నిమిషాల పాటు స్వయంగా ప్రజల నుంచి రేవంత్ రెడ్డి అర్జీలను స్వీకరించారు.
దాదాపు పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ప్రజాదర్భార్ నిర్వహించడంతో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను ముఖ్యమంత్రితో చెప్పుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే జ్యోతీభా పూలే ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని ముందుగానే అధికారులు అంచనా వేసి.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 15వేల వాటర్ బాటిళ్లను సరఫరా చేశారు. జనాలకు ఎండ తగలకుండా టెంట్లు వేయించారు. అలాగే ఆరోగ్య సిబ్బందితో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు.
సీఎంకు అర్జీలను అందించేందుకు ముందుగా దివ్యాంగులకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత వృద్ధులకు అవకాశమిచ్చారు. దాదాపు 55 నిమిషాల పాటు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అప్యాయంగా పలకరిస్తూ రేవంత్ రెడ్డి వారి సమస్యలను విన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లడంతో.. మంత్రి సీతక్క, అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నాలుగు గంటలపైనే ఉండి సీతక్క ప్రజల సమస్యలను విన్నారు.
అయితే తొలి ప్రజాదర్భార్కు ప్రజల నుంచి 2 వేలకు పైగా అర్జీలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 120 మందితో కూడిన ప్రత్యేక సిబ్బంది డిజిటలైజ్ చేసి.. ప్రతి సమస్యకు ఒక యూనిక్ నెంబర్ను కేటాయించారు. అంతేకాకుండా వినతి ఇచ్చిన వారి ఫోన్కు కూడా మెసేజ్ కూడా పంపించారు. అలాగే అర్జీల డేటా మొత్తాన్ని సాయంత్రం 5.30 గంటల వరకు సిద్ధం చేసి సచివాలయానికి.. వివిధ జిల్లా కలెక్టరేట్లకు పంపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ