తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన ప్రోటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్ ఓవైసీ చేత ప్రమాణం చేయించారు. అయితే సభలో అత్యంత సీనియర్లను పక్కన పెట్టి అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్గా నియమించడం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీనియర్లను పక్కన పెట్టి అక్బరుద్దీన్కు ప్రోటెం స్పీకర్ ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో అత్యంత సీనియర్ను ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేస్తారు. కొత్తగా అసెంబ్లీ కొలువు తీరిన రోజున ప్రోటెం స్పీకర్.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ప్రస్తుతం సభకు ఎంపికయిన వారిలో అత్యంత సీనియర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సభ సంప్రదాయం ప్రకారం ఆయననే ప్రోటెం స్పీకర్గా నియమించాలి.
అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీనివాస్ రెడ్డి స్పీకర్గా పని చేశారు. ఇప్పుడు ప్రోటెం స్పీకర్గా నియమిస్తే.. ఆయన స్థాయిని తగ్గించినట్లు అవుతుంది కాబట్టి.. ఆయన తర్వాత సీనియర్ అయిన హరీష్ రావును ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు హరీష్ రావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ హరీష్ రావును కూడా పక్కనపెట్టి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేశారు. దీంతో ఆయన కంటే సీనియర్లను పక్కన పెట్టి.. అక్బరుద్దీన్ను ఎలా ప్రోటెం స్పీకర్గా నియమిస్తారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాలేదు. పూర్తిస్థాయి స్పీకర్ నియామకం తర్వాతే ప్రమాణస్వీకారం చేస్తామమని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అలాగే శాసనసభ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శాసనసభ నిబంధనలు ఉల్లంఘించి ప్రోటెం స్పీకర్ బాధ్యతలు మజ్లిస్కు ఇవ్వడంపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు రోజులకే.. కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటేనన్న విషయం బయటపడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే.. సీనియర్లను కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమించారని చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్ధతు లేకుంటే.. ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందనే భయం కాంగ్రెస్కు పట్టుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ