మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఆయా పార్టీల్లో ఇప్పటికే టిక్కెట్లు లభించిన వారు ప్రచారం ప్రారంభించారు. విజయదశమి రోజునే చాలా మంది రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలుపు కోసం తమ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు.. వైరి పార్టీ కార్యక్రమాల్ని ఎండగడుతూ బహిరంగ సభల్లో ప్రసంగాలు చేయడం పాత పద్ధతి. అలాగే ప్రజల వద్దకే వెళ్లడం.. చౌరస్తాల్లో న లుగురు గుమికూడే చోట మాట్లాడం మరో పద్ధతి. ఇంటింటికి పాదయాత్రలతోనూ ఇప్పటికే పలువురు నేతలు తమ ప్రచారాలు చేపట్టారు. కేవలం వీటితోనే గెలవడం రాబోయే ఎన్నికల్లో అసాధ్యం.
వీటితోపాటు సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉండి ప్రత్యర్థులను చిత్తు చేస్తే వారే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నుంచే సోషల్ మీడియాను వాడుకోవడం రాజకీయ నేతలకు తెలిసినప్పటికీ, అప్పట్లో అంతగా పాపులర్ కాలేదు. ప్రస్తుతం పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ సోషల్మీడియా గ్రూపులు చాలా యాక్టివ్గా ఉంటున్నాయి. ప్రత్యర్థులపై ట్రోలింగ్స్తో పాటు విభిన్న వ్యంగ్య చిత్రాలతోను, మార్ఫింగ్ల మాయా జాలంతోనూ ఎండగడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్స్, కమ్యూనిటి, గ్రామాల వారీగా వాట్సప్ గ్రూపులు అంతటా హల్చల్చేస్తున్నాయి. ఇక పార్టీల పరంగా గ్రామ,మండల,డివిజన్, పట్టణ, నియోజకవర్గ, నగర గ్రూపులుగానూ పూర్తియాక్టివ్గా ఉంటున్నాయి.
వాస్తవానికి సాధారణ పత్రికలు, టీవీ మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా వేగంగా ప్రచారం అవుతుండటంతో ప్రాధాన్యత పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ఆయా రాజకీయపార్టీలు సోషల్మీడియా గ్రూపుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ సైతం సోషల్మీడియా ప్రాధాన్యతను వివరిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. సోషల్ మీడియాను ఆధారం చేసుకునే మోదీ ప్రధాని అయ్యారని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. వాట్సప్, ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను ప్రచార వేదికలుగా వినియోగించుకొని విస్తతంగా ప్రచారం చేయాలని సూచించారంటే సోషల్మీడియాకు పెరిగిన ప్రాధాన్యతను అంచనా వేసుకోవచ్చు. గ్రూపులకు పార్టీ గుర్తును డీపీగా పెట్టుకోవాలని కూడా సూచించారు.
బీఆర్ఎస్ కంటే ముందు నుంచే బీజేపీ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంది. కాంగ్రెస్, తదితర పార్టీలు సైతం ‘సోషల్’బాట పట్టాయి. తీన్మార్ మల్లన్న వంటి వారు సైతం సోషల్మీడియా ద్వారానే బాగా పాపులర్ కావడం తెలిసిందే. ఎవరికి వారుగా యూట్యూబ్ చానెళ్లు కూడా పెరిగిపోతుండటం తెలిసిందే. పత్రికల్లో ప్రచారం చేస్తే ఎన్నికల వ్యయం కిందకు రావడం కూడాఎక్కువమంది రాజకీయనేతలు సోషల్ మీడియాను వినియోగించుకునేందుకు ఒక కారణం. ఈ నేపథ్యంలో సోషల్మీడియాలో జరిగే ప్రచారాన్ని సైతం ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయం కిందకు తీసుకువచ్చినా, సోషల్ మీడియాలో చేసే ప్రచారానికి కూడా ముందస్తు అనుమతి పొందాలనే నిబంధన విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో చూడాలి!!
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ