తెలంగాణలో హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ సత్తా చాటింది. సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లకు ఎన్నికలు జరగగా.. అందులో ఐదు డివిజన్లలో ఏఐటీయూసీ గెలుపొందింది. మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజకేతనం ఎగురవేసింది.
కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం 11 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 84 పోలింగ్ కేంద్రాల్లో 39,775 మంది సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 94.15 శాతం పోలింగ్ నమోదయింది. అయితే అదే రోజు అధికారులు ఓట్లు లెక్కించగా.. బుధవారం అర్థరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అర్థరాత్రి తర్వాత అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రామగుండం-1, రామగుండం-2 డివిజన్లతో పాటు.. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో ఏఐటీయూసీ సంఘం గెలుపొందింది.
శ్రీరాంపూర్ డివిజన్లో 2,166 ఓట్ల మెజార్టీతో.. బెల్లంపల్లిలో 122 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమయిన ఐఎన్టీయూసీ కొత్తగూడెం, కొత్తగూడెం కార్పోరేషన్, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం-3 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలను ఐఎన్టీయూసీ క్వీన్స్లీప్ చేసింది. ఇప్పటి వరక ఏఐటీయూసీ మూడు సార్లు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికవ్వగా.. తాజా విజయంతో నాలుగోసారి ఎన్నికయింది. ఆ తర్వాత అత్యధిక స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి ప్రాతినిధ్య సంఘం హోదా దక్కింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE