తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడటంతో.. నెల రోజుల నుంచీ వివిధ పార్టీల ప్రచారాలతో హోరెత్తిన వీధులు నిశ్శబ్దంగా మారిపోయాయి.ఇటు నవంబర్ 30న పోలింగ్ జరగనుండటంతో.. తెలంగాణ ఓటర్లు గురువారం రోజు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, ములుగు, పినపాక, చెన్నూర్, ఇల్లందు, మంథని, భూపాలపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్కు అనుమతిస్తారు. ఇప్పటికే స్టేట్ ఎన్నికల్ కమిషన్ పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు భద్రతా పరంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగింది. మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలంటూ హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ నేతలు, ఈసారి ఎలా అయినా కాంగ్రెస్ జెండాను తెలంగాణాలో ఎగరేయాలని హస్తం పార్టీ, తెలంగాణలో తమ ప్రాధాన్యత పెంచుకోవడానికి ఈ ఎన్నికలే అవకాశం అంటూ కాషాయ పెద్దలు ఇలా ప్రతీ ఒక్కరూ తమ ప్రచారాలను హోరెత్తించారు. ఏకంగా ఢిల్లీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ వచ్చి మరీ ప్రచారానికి దిగారు.
బీజేపీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా,ఇతర మంత్రులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నేతలయిన బండి సంజయ్, కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ తమ ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొని జోష్ పెంచారు. అలాగే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రచారం చేశారు.ఇక బీఎస్పీ తరుఫున మాయవతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గట్టిగానే ప్రచారం చేశారు.
మంగళవారం సాయంత్రం నుంచీ.. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టడంలో బిజీ అయిపోయారు. ఆ నియోజకవర్గంలో ఉన్న డిమాండ్ను బట్టి డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. అయితే రిజర్వుడ్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఓటరుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తుండగా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓటరుకు రూ.5 వేల వరకు కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఫ్లయింగ్ స్వ్కాడ్స్ను అలర్ట్ చేసి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ