హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి ఇకపై సరికొత్త ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. మెట్రో రైళ్లలో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా మొబైల్ డేటా లేకుండానే నచ్చిన గేమ్లు, సినిమాలు, వీడియోలు వీక్షించే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. ఈ మేరకు షుగర్బాక్స్ నెట్వర్క్తో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. హైదరాబాద్ మెట్రోలో షుగర్ బాక్స్ నెట్వర్క్ను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వై-ఫై సేవలను 10 మెట్రోస్టేషన్లలో ప్రారంభించినట్లు చెప్పారు. అతి త్వరలోనే మరిన్ని మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వినోదం, మేథోసంపత్తిని పెంచే పుస్తకాలును మెట్రో రైళ్లలో ఉంచాలని కోరామని చెప్పారు. ఈ యాప్ ద్వారా కేవలం మూడు నిమిషాల్లోనే సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు మెట్రో స్టేషన్లలో కల్పిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. షుగర్ బాక్స్ సీఈవో రోహిత్ మాట్లాడుతూ, ఈ సేవలను 60 రోజుల వరకు ఉచితంగా కొనసాగిస్తామని, ఆ తరువాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణం చేసే వారికీ ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
[subscribe]