హైదరాబాద్ నగరంలో నిమజ్జనానికి వందల కొలదీ గణేష్ విగ్రహాలు బారులు తీరుతున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహం హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి తరలింది. దీనికోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై మహాగణపతి ఊరేగింపుగా బయలుదేరాడు. నిన్న రాత్రి భారీ వర్షం పడడంతో శోభాయాత్ర ముందుగా అనుకున్న సమయానికంటే కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాగణపతిని చివరిసారిగా దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో దారులన్నీ మారుమోగుతున్నాయి.
కాగా 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో విగ్రహం బరువు గతంలో కంటే (60 నుంచి 70 టన్నులు) పెరిగింది. ఇక ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయిన శోభాయాత్ర.. రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకోనుంది. అక్కడకు చేరాక వాహనం నుంచి విగ్రహాన్ని వేరు చేయడానికి ప్రత్యేకంగా అమర్చిన వెల్డింగ్లను తొలగిస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న మహాగణపతికి అశేష భక్తజనం కోలాహలం మధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో హుస్సేన్సాగర్లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని నిర్వహులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ