తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో ఖమ్మం పట్టణంలో రూ.27 కోట్ల వ్యయంతో 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్థుల్లో నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అన్ని ప్రముఖ ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, నిజామాబాద్, మహబూబ్నగర్ లలో ఐటీ హబ్లకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఖమ్మం ఐటీ హబ్ లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే 19 కంపెనీల కార్యకలాపాలు మొదలైనట్టు పేర్కొన్నారు. ఇక ఖమ్మంలో ఐటీ హబ్ ఫేజ్-2 కోసం రూ.20 కోట్లను త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. ఐటీ హబ్ను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ