రాజకీయాల్లో ప్రతిభ లేకుండా కేవలం వారసత్వంతోనే రాణించలేమని, అది ప్రవేశం కల్పించడానికే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జరిగిన ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం మరియు భవిష్యత్తు’ అనే అంశంపై జాతీయ సెమినార్ ప్రారంభ సెషన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాలే కాదు ఏ రంగంలో అయినా వారసత్వంతో రాణించలేమని, ఎవరికి వారు నిరూపించుకోలేకపోతే ఎంత గొప్ప వారసత్వాన్ని అయినా ప్రజలు ఇష్టపడరని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వంటి మహామహులనే ప్రజలు ఓడించారని, తాను సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు కూడా తనను ఎప్పుడో పక్కన పెట్టేవారని అన్నారు.
నాటి స్వాతంత్య్రోద్యమం సహా ఇటీవలి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజలను చైతన్యవంతం చేయడంలో వార్తా పత్రికలు కీలకపాత్ర పోషించాయని, అయితే ప్రస్తుతం ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి పలు పేపర్లు చదవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ జర్నలిస్టులకు షోయబ్ ఉల్లా ఖాన్ ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం ప్రతాపరెడ్డి నాటి పాలకులలో భయం కలిగించారని తెలిపారు. అలాగే టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ మలిదశ ఉద్యమంలో అండగా నిలబడింది తెలంగాణ జర్నలిస్టులేనని, వారు మద్దతివ్వడం వల్లనే తెలంగాణ సాధించుకోగలిగామని వెల్లడించారు. ఇక దేశంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దాదాపు 19 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులుజారీ చేశామని తెలియజేశారు.
ఇక దేశవ్యాప్తంగా ఎన్నో పత్రికలు, ఛానళ్లు కేంద్రం చెప్పినట్లుగా నడుచుకుంటున్నాయని, ప్రధాని మోదీపై శ్రీలంక మంత్రులు కొందరు ఆరోపణలు చేస్తే ఒక్క పత్రిక కూడా దానిలో నిజాలు వెలికితీయడానికి ప్రయత్నించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎనిమిదేళ్లుగా ‘ప్రధాని మోదీ మన్ కీ బాత్ మనం వినాల్సిందే,.మన మన్ కీ బాత్ ఆయన వింటారా’? అని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే కరోనా మహమ్మారి విపత్కర సమయంలో 9 బిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్ ఉత్పత్తి చేసిందని, అయితే దీని గురించి మన మీడియా ఎందుకు ప్రముఖంగా ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఇక తెలంగాణ ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిందని, కానీ ఏ పేపర్లో కూడా దీనిని పతాక శీర్షికల్లో వేయరని, మీడియా ఎప్పుడు నిజాలను ప్రజలకు తెలియజేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE