ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రధాని మోదీ రామగుండంకు చేరుకున్నారు. ముందుగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ను సందర్శించారు. ఆర్ఎఫ్సీఎల్ లో కలియతిరుగుతూ ఎరువుల ఉత్పత్తిని ప్రధాని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరు, ఉత్పత్తి, ఇతర సంబంధిత వివరాలను సంస్థ అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ మైదానంలో బహిరంగ సభ వేదిక వద్దకు ప్రధాని చేరుకున్నారు. ప్రధానితో పాటుగా ఈ సభలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అధికారులు హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ఈ సభ వేదిక నుంచే రూ.6300 కోట్లుకంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేసిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అలాగే దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని కూడా డిజిటల్ గా ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం రూ.2200 కోట్లకు పైగా విలువైన రహదారుల ప్రాజెక్టులయిన మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి-NH- 765డీజీ, బోధన్-బాసర-భైంసా-NH-161 బీబీ, సిరొంచా-మహదేవ్పూర్-NH-353సీలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. సభ అనంతరం ప్రధాని మోదీ రామగుండం నుండి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నారు.
ముందుగా రామగుండం ఫెర్టిలైజర్ ప్రాజెక్టుకు 2016, ఆగస్టు 7న ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే ప్రధాని దార్శనికతలో భాగంగా ఈ ఫెర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ చేయబడిందని తెలిపారు. రామగుండం ప్లాంట్ సంవత్సరానికి 12.7 ఎల్ఎంటీ దేశీయ వేప పూతతో కూడిన యూరియా ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తుంది. కాగా రామగుండం ఎరువుల ప్లాంట్ లో 2021, మార్చి 22 నుంచే యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడింది. రూ.6300 కోట్లుకంటే ఎక్కువ పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్ఎఫ్సీఎల్కు అప్పగించారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్కు గ్యాస్ జగదీష్పూర్-ఫుల్పూర్-హల్దియా పైప్లైన్ ద్వారా సరఫరా చేయబడుతుంది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలోని రైతులకు యూరియా ఎరువులు తగినంత మరియు సకాలంలో సరఫరా అయ్యేలా ఈ ఎరువుల ప్లాంట్ నిర్ధారించనుంది. ఈ ప్లాంట్ ఎరువుల లభ్యతను మెరుగుపరచడమే కాకుండా రోడ్లు, రైల్వేలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ఈ ప్రాంతంలో మొత్తం ఆర్థికాభివృద్ధిని కూడా పెంచుతుందని తెలిపారు. ఫ్యాక్టరీకి వివిధ వస్తువుల సరఫరా కోసం ఎంఎస్ఎంఈ విక్రేతల అభివృద్ధి నుండి ఈ ప్రాంతం ప్రయోజనం పొందుతుందన్నారు. ఆర్ఎఫ్సీఎల్ యొక్క ‘భారత్ యూరియా’ దిగుమతులను తగ్గించడమే కాకుండా ఎరువులు సకాలంలో సరఫరా చేయడం ద్వారా స్థానిక రైతులకు ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE