తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలకు మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మే 12 నుంచి వాల్యుయేషన్ పక్రియ మొదలుపెడతామని, ఈ రోజు జవాబు పత్రాల కోడింగ్ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ మోడ్రన్ లాంగ్వెజెస్, జాగ్రఫీ పరీక్షలను మే18న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలతో పదోతరగతి పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు మే 11 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాలలో మే 11 నుండి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఇక రెడ్ జోన్ సంబంధిత ప్రాంతాల్లో లాక్డౌన్ ముగిసిన తరవాత వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu