తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇండోనేషియాకు చెందిన ఏడుగురి సాంపిల్స్ నివేదికల్లో పాజిటివ్ వచ్చిందని, వీరిని మార్చ్ 16 నుంచే ఐసోలేషన్లో ఉంచినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మరింత అప్రమత్తమయి ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమవుతుంది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన అన్ని కేసులు కూడా విదేశాల నుంచి వారే కావడంతో ఇక నుంచి వారిపై మరింత దృష్టి సారించనున్నారు. విదేశాల నుంచి వేల సంఖ్యలో రాష్ట్రానికి వచ్చేవారికీ అనుగుణంగా కావాల్సినన్ని క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ముందుగా నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా వైరస్ సోకగా, తాజాగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో మరొకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు బుధవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 109 మంది బ్లడ్ సాంపిల్స్ సేకరించారని, వారిలో 94 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే విధంగా మరో 13 మంది సాంపిల్స్ యొక్క ఫలితాలు రావాల్సి ఉందని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఇతర కోచింగ్ సంస్థలకు మార్చ్ 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం