జూలై 17వ తేదీన జరిగే సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీలతో కలిసి 17న జరిగే అమ్మవారి బోనాలు, 18న జరిగే రంగం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, బోనాల ఉత్సవాలు అంటే ఒకప్పుడు కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ లకు మాత్రమే పరిమితమైనాయని, నేడు అవి విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కారణంగా నిర్వహించలేదని తెలిపారు. ఈ సంవత్సరం బోనాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా బోనాల ఉత్సవాల సందర్భంగా 100 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ సంవత్సరం బోనాలకు గతంలో కంటే అత్యధిక స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గోల్కొండ బోనాలు ప్రారంభమైనాయని, అక్కడ కూడా అంచనాలను మించి భక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీన జరిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి సుమారు 8 లక్షల మంది వరకు హాజరయ్యారని తెలిపారు. మహంకాళి బోనాలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం 1500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్ని కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈవ్ టీజింగ్ నివారణకు ప్రత్యేక షీ టీంలను కూడా నియమించడం జరుగుతుందని తెలిపారు.
మరోవైపు వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అందించేందుకు 6 లక్షల వాటర్ ప్యాకెట్ లు, 25 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో వైద్య శిభిరాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్, స్కౌట్ గైడ్ వారు అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు ఏర్పాట్లపై చేసిన సూచనలకు స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, బోనాల ఉత్సవాలు ఎంతో గొప్ప పండుగ అని, దీనిని ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. బోనాల ఉత్సవాలకు గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY