జూన్ 30 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూన్ 30న నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం గోల్కొండ కోట వద్ద స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ పండుగలయిన బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది తెలంగాణ ప్రజలకెంతో గర్వకారణం అని అన్నారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జూన్ 30న గోల్కొండ, జూలై 17న సికింద్రాబాద్, జూలై 24న హైదరాబాద్ బోనాలు జరుగుతాయని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని అన్నారు. బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మఫ్టీ పోలీసులు, షీ టీమ్ లను కూడా నియమిస్తున్నామని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకేట్స్, 55 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు.
అదేవిధంగా 4 అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని, 5 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ జోయల్ డేవిస్, ఏసీపీ శివ మారుతి, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ట్రాన్స్ కో సీజీఎం నరసింహ స్వామి, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, దేవాదాయ శాఖ డీసీ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఈవో శ్రీనివాస్ రాజు, జీహెఛ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్, పురావస్తు శాఖ అధికారి రోహిణి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్ఈ హఫీజ్, వాటర్ వర్క్స్ జీఎం నాగేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, ఆర్టీసీ ఆర్ఎం ప్రసాద్, అగ్నిమాపక శాఖ ఆర్ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY