మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం సమావేశం నిర్వహించిన ఆయన బీజేపీపై ఛార్జీషీట్ను వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మనదేశంలో ఇప్పటివరకు 14మంది ప్రధానులుగా చేశారని, వారిలో ఏ ఒక్కరూ చేయని విధంగా ప్రధాని మోదీ తొలిసారిగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించారని మంత్రి తెలిపారు. మునుగోడు ప్రజల తరపున ఈ రోజు బీజేపీపై ఛార్జీషీట్ వేస్తున్నామని అన్నారు. ఇక ఈ ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పకుండా, సీఎం కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపికి ఓటు – మునుగోడుకు చేటు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీపై టీఆర్ఎస్ ప్రకటించిన ఛార్జీషీట్లోని కీలక అంశాలు మంత్రి కేటీఆర్ మాటల్లో..
మునుగోడు ఫ్లోరైడ్ గోడు వినలేదు
- నాటి ప్రధాని వాజ్పేయి టేబుల్ మీద ఫ్లోరైడ్ బాధితుడిని పడుకోబెట్టి, గోడు వెళ్లబోసుకున్నా బీజేపీ ప్రభుత్వం చర్యలు శూన్యం.
- ఫ్లోరైడ్ మహమ్మారిని మట్టుబెట్టి.. మంచినీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన మహత్తర పథకం మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే నీతిలేని మోదీ సర్కారు 19 పైసలు కూడా ఇవ్వలేదు.
- కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్ట్ ను కట్టబెట్టారు బీజేపీ పెద్దలు.
- ఎన్నో పోరాటాల ఫలితంగా మంజూరయ్యి, చౌటుప్పల్లో ఏర్పాటు కావలసిన ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ ను వేరే రాష్ట్రానికి తరలించింది.
- మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని 2016లో నాటి కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు.
మగ్గానికి మరణ శాసనం-చేనేతకు ఉరి
- చరఖా తిప్పి, నూలు వడికి చేనేతను స్వదేశీ ఉద్యమానికి ప్రతీకగా నిలబెట్టిండు గాంధీ మహాత్ముడు. ఇప్పుడు మోదీ వచ్చి చరిత్రలో తొలిసారి చేనేతపైన పన్నువేసి మగ్గానికి మరణశాసనం రాస్తున్నడు.
- 5 శాతం జీఎస్టీ విధించమే కాదు. దానిని 12 శాతానికి పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేసి.. బట్టలు నేసే వాళ్ళ పొట్ట కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నది మోదీ ప్రభుత్వం.
- స్వాతంత్ర స్వర్ణోత్సవాల కోసం జాతీయ జెండాల తయారీని దేశ నేతన్నలకు అప్పగించకుండా, చైనా నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం పట్టించింది ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం.
ఉన్న స్కీమ్లన్నీ ఊడగొట్టి, చేనేత కళాకారుడి చేతిని నరికేసేస్తున్నది మోడీ సర్కారు
- ఆలిండియా హాండ్లూమ్ బోర్డు రద్దు
- ఆలిండియా హాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు
- మహాత్మ గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు
- లాంబార్డ్ బీమా రద్దు
- హౌజ్ కం షెడ్ స్కీం రద్దు
- థ్రిఫ్ట్ ఫండ్ రద్దు
- యార్న్పైన సబ్సిడీ 40 నుంచి 15 శాతానికి తగ్గింపు
నేతన్నకు చేయూతనిచ్చేందుకు ఎన్ని ప్రతిపాదనలు కేంద్రం నుంచి స్పందన లేదు
- తెలంగాణలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ స్థాపించాలని వినతి.
- హాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వినతి.
- నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేయాలని వినతి.
- కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు నయాపైసా ఇవ్వలేదు.
- నారాయణపేటలో హాండ్లూమ్ పార్క్ పెడతామని అమిత్ షా ఇచ్చిన హామీ అటకెక్కింది.
మోటర్లకు మీటర్లు-ఉచిత విద్యుత్కు ఉరి
- బోరుబావుల కింద కరెంట్తో వ్యవసాయం చేసుకుంటున్న 30 లక్షల మంది రైతులను బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందే, నెలనెలా రైతు కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తున్నది మోదీ సర్కారు.
- రైతులపై పగబట్టిన బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడితేనే ఏడాదికి రూ. 6 వేల కోట్ల రుణం ఇస్తమని షరతులు పెట్టి రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేసింది. రైతుల ప్రయోజనం కల్పించడం కోసం సుమారు రూ. 30 వేల కోట్ల రుణాన్ని వదులుకుంది కేసీఆర్ ప్రభుత్వం.
కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం
- కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది కేంద్రం లోని బీజేపీ.
- 575 టీఎంసీల న్యాయమైన వాటా దక్కకుండా చేస్తూ, ఉమ్మడి నల్లగొండ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నది మోదీ ప్రభుత్వం.
- కేంద్రం నాన్చుడి ధోరణితో డిండి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అడ్డు తగులుతున్నది.
వంటగదిలో మంటపెట్టిన మోదీ
- వంట గదిలో సిలిండర్ మంటలు పెట్టి, ఆడబిడ్డల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నది కేంద్రం.
- 2014లో 410 రూపాయలు వున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు దాటింది.
- మోదీ అధికారంలోకి వచ్చాక నెమ్మదిగా సిలిండర్ పై సబ్సిడీ, 2014 లో ఉన్న నగదు బదిలీ రాయితీని ఎత్తేశారు.
జనంపై పెట్రో బాంబు.. ధరల దాడి
- అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సు లు వడ్డించి, పెట్రోల్ డిజీల్ ధరలను సెంచరీ దాటించిన ఘనడు మోదీ. ముడి చమురు ధర పెరగకున్నా, అదనపు సెస్సులు మోత మోగించి చమురు రేట్లను పెంచి, జనం చేతి చమురు వదిలించింది బీజేపీ ప్రభుత్వం.
- కరోనా కాలంలో కూడా కనికరం చూపకుండా సెస్సులు ద్వారా ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను దండుకున్నారు.
- నిత్యావసర వస్తువులు ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఏం కొనేటట్టు లేక, ఏం తినేటట్టు లేక పేదల బతుకు బండి తిరగబడింది.
గిరిజన రిజర్వేషన్లకు మోకాలడ్డు
- పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఆమోదం చెప్పకుండా 5 ఏండ్లు తొక్కిపెట్టి గిరిజన ద్రోహానికి పాల్పడింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
- పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే ఆ ప్రతిపాదనే రాలేదని పచ్చి అబద్ధం చెప్పి తెలంగాణ గిరిజన బిడ్డల హక్కులను చులకనగా చూసి అవమానించిన దుష్ట పార్టీ బీజేపీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY