ఎన్నికల్లో గెలిస్తే అది చేస్తాం..ఇది చేస్తామని చెబుతున్న నేతలు, మద్య పాన నిషేధం హామీ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రధాన హామీగా ఉండే మద్యపాన నిషేధం మాటే ఎత్తటం లేదు. తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాలలో విచ్చలవిడి లిక్కర్ అమ్మకాల వల్ల లక్షలాది మంది రోడ్డున పడుతున్నారు. వేల కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి దిక్కులేని వారిగా మారుతున్నారు. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి సంపూర్ణ మద్య నిషేధం మాట కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. తాజాగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఏ నేత వెంట కూడా ఈ మాట రావడం లేదు.
నిజానికి లిక్కర్ను ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇవేవీ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. మద్యం అమ్మకాలను పెంచడానికి ఏకంగా ఎక్సైజ్ అధికారులకే టార్గెట్లు పెట్టి ప్రభుత్వం పని చేయిస్తోందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి.అయితే ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలే కాదు..ఇన్నాళ్లూ విమర్శలు చేస్తున్న నేతలూ మద్యనిషేధం ఊసెత్తడం లేదు. కొంచెంలో కొంచెం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం.. బెల్టు షాపులను అరికడతామని ప్రకటిస్తోంది. అయితే ఆ పార్టీ కూడా మద్య నిషేధం అని కానీ, మద్యం షాపులను తగ్గిస్తామని కానీ, తాగుడు అలవాటును మాన్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త పడుతోంది.
ప్రస్తుతం అత్యధిక ఆదాయం లిక్కర్ ద్వారా రావడంతో..లిక్కర్ను ప్రభుత్వాలు ఆదాయ మార్గంగా చూస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు దాన్నో కొన్ని వర్గాలకు ఉపాధి అంశంగా ప్రమోట్ కూడా చేస్తున్నాయి. అందుకే వైన్ షాపుల కేటాయింపులలో కూడా.. గౌడ సామాజిక వర్గానికి 15 శాతం అంటూ, ఎస్సీలకు 10 శాతమంటూ, ఎస్టీలకు 5 శాతం అని రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ సామాజిక వర్గాలకు ఉపాధిని కల్పిస్తున్నామన్న భావనను తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
మద్య పాన నిషేధం అనాల్సిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాం కంటే మూడాకులు ఎక్కువ చదివనిట్లు .. తాము అధికారంలోకి వస్తే షాపుల కేటాయింపులో గౌడ్లకు ఇప్పటి వరకూ ఉన్న 15 శాతం రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో అంతర్లీనంగా.. మందు అమ్మకాలు అనేవి ప్రభుత్వ ఆదాయంతో పాటు, వివిధ సామాజిక వర్గాల ఉపాధి అంశంగా మారిపోయింది. ఒకవవేళ ఎప్పుడైనా వైన్ షాపులను తొలగించాలని ఏ ప్రభుత్వం అయినా నిర్ణయం తీసుకుంటే మాత్రం ..దానిని తమ ఉపాధిని దెబ్బ తీసే చర్యగా ఆ సామాజిక వర్గాలు భావించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అటు లిక్కర్ను ఆదాయంగా మార్చుకున్న ప్రభుత్వాలు..వైన్ షాపుల సంఖ్యను తగ్గించకుండా, ఆయా సామాజిక వర్గాల ఉపాధి కల్పన కోసమే అని చెబుతూ ఆ షాపుల సంఖ్యను పెంచే ప్రమాదం లేకపోలేదు.
నిజానికి ఈ పదేళ్లలోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు అతి భారీగా పెరిగిపోయాయి. సగటున ప్రతి రెండు గ్రామాలకు ఒక వైన్ షాపును.. వీటికి అనుబంధంగా ప్రతి గ్రామానికి 2, 3 బెల్టు షాపులను ప్రభుత్వం నడిపిస్తూ వస్తోంది. ఈ విచ్చిలవిడి మద్యం అమ్మకాలతో లక్షల మంది మద్యానికి బానిసలయ్యారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా, మద్యాన్ని ఆదాయ మార్గంగా మాత్రమే ప్రభుత్వం చూస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏడాదికి రూ. 10 వేల కోట్లుగా ఉన్న మద్యం రెవెన్యూ, ఇప్పుడు రూ.35 వేల కోట్లు దాటిందంటేనే దీనిని అర్ధం చేసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE