‘ప్రజా శాంతి పార్టీ’ రద్దు కాలేదని స్పష్టం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పార్టీ రద్దయిందని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కేఏ పాల్ గురువారం సికింద్రాబాద్ లోని హరిహరకళాభవన్ లో నగరంలోని పలు చర్చిలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘ప్రజా శాంతి పార్టీ’ రద్దు కాలేదని, తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఈసీ పంపిన నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తామని, సంతృప్తికర వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలనే దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజా శాంతి పార్టీని రద్దు చేసేసినట్లు ప్రజలకు అవాస్తవాలను చెప్తున్నారని, మా పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని పాల్ అన్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. యాదగిరి గుట్ట అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ ఒక్క చర్చికీ రూ.2 వేలు కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు. అలాగే తానే ముఖ్యమంత్రిని అయివుంటే రాష్ట్రంలోని అన్ని ప్రార్ధనా స్థలాలకు మతంతో సంబంధం లేకుండా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా మునుగోడు ప్రజలకు పాల్ ఒక ఆఫర్ ఇచ్చారు. ఈనెల 25వ తేదీన తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడులో 59 మందికి లక్కీ డ్రా తీసి పాస్పోర్టులు ఇప్పిస్తానని, అలాగే వారికి విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పించేందుకు ప్రయత్నం చేస్తానని పాల్ ప్రకటించారు. మరో 7వేల మందికి ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ లో శాంతి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపిన పాల్, సీఎం కేసీఆర్ తనకు ఒక లేఖ ఇస్తే రాష్ట్రానికి రూ. లక్ష కోట్లు తెప్పిస్తానని ప్రకటించారు. ఇక ప్రజా గాయకుడు ‘గద్దర్’ కొన్నివేల పాటలు రాశారని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY