ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగంపై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనివార్యత పెరిగిందని కేబినెట్ భావించింది. వారి గ్రామాల్లో గనుక ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారని కేబినెట్ భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.
విద్యార్థులను ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడా మైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రైవేట్ కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ నిర్ణయించి ఈ మేరకు విద్యాశాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్ నిర్ణయించింది.
ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు నూతనచట్టం:
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల వసూల్లపై సర్వత్రా వ్యతరేకత వినవస్తున్నదనే విషయాన్ని కేబినెట్ చర్చించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింతగా చేరువచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ స్కూల్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు నూతన చట్టాన్ని తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి స్థాయి అధ్యయనం చేసి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై ప్రణాళికలు, ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం రూపొందించాలనే రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రానున్న శాసనసభా సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ‘మహిళా యూనివర్సిటీ ఏర్పాటు’ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ