తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 40 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పుతో ఈ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అలాగే మండపంలో ఈ విగ్రహానికి ఓ వైపు కాలనాగ దేవత, మరోవైపు కృష్ణ కాళి విగ్రహాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా మహాగణపతిని దర్శనం విషయంలో భక్తులకు కొన్ని ఆంక్షలు విధించారు. ఈసారి ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ, మహాగణపతి దర్శనం కోసం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ పేర్కొంది.
ఖైరతాబాద్ లో మహాగణపతి దర్శనం కోసం ప్రతి సంవత్సరం భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. భక్తులందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించేలా చూడడం, శానిటైజర్ టన్నెల్స్ ఏర్పాటు, టెంపరేచర్ తనిఖీ కోసం ధర్మల్ స్కానింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఖైరతాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నేడు ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంతో ముగియనున్నాయి. దీంతో అప్పటివరకు ఖైరతాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ గణేష్ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండడంతో అన్ని నిబంధనలతో జరుపుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత శాఖల ద్వారా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ