తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం విశాఖపట్నంలోని ‘వి కన్వెన్షన్’ సెంటర్లో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై చంద్రబాబు సమీక్షించారు. త్వరలోనే ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని వెల్లడించిన ఆయన, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై టీడీపీ నేతలకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం బయటినుంచి పేరున్న నాయకులు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని, అయితే మొదటి ప్రాధాన్యం మాత్రం పార్టీలో ముందు నుంచి ఉన్న వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం ట్రయల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇక 175 సీట్లకు పోటీ చేయగలరా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, అయితే టీడీపీని ఎవరూ శాసించలేరని గుర్తుంచుకోవాలని, ముఖ్యమంత్రి సొంత ఇలాకా పులివెందుల లోనే ఆ పార్టీని ఓడిస్తామని చంద్రబాబు చెప్పారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇంకా పది నెలల సమయమే ఉందని, ఆయన ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం ఆలయం తెలంగాణకు వెళ్లిపోయిందని, ఏపీలో కూడా అలాంటి క్షేత్రం ఉండాలని భావించి ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేస్తే, నిన్న జరిగిన సీతారామ కల్యాణం మహోత్సవానికి కూడా సీఎం జగన్ వెళ్లలేదని ఆక్షేపించారు. ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిలో భాగమే నగరంలోని కార్తీకవనం, ప్రేమసమాజం, దసపల్లా, హయగ్రీవ భూములు చేతులు మారాయని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు స్పెషల్ సిట్ వేస్తామని, దీనివెనుక ఉన్న సూత్రధారులను బయటకు లాగుతామని చంద్రబాబు హెచ్చరించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నంలో రైతుబజార్లు, రెవెన్యూ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టారని, రుషికొండను తవ్వేసి పూర్తిగా బోడిగుండు చేశారని విమర్శించారు. ఇక విశాఖ మెట్రో రైలు విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫిన్టెక్ సిటీ, లులూ షాపింగ్ మాల్ తదితర ప్రముఖ పరిశ్రమలను తాము తీసుకొస్తే.. నేడు వాటిని తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు రాజధాని అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ గతంలో టీడీపీ కార్పొరేటర్గా ఉండేవారని, ఇప్పుడేమో కోడిగుడ్డు నీతులు చెబుతున్నారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE