ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీకి వెళ్లిన కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అందరు ఎమ్మెల్యేలలాగే రెండు నెలల క్రితమే కేసీఆర్ కూడా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఆయన ఫామ్హౌజ్లో కాలు జారి పడడం.. తుంటికి గాయం కావడంతో ప్రమాణం చేయడం ఆలస్యమయింది. ఇక గురువారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఈక్రమంలో ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడానికి ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఒక తెలంగాణలో తమ పార్టీ అధికారం కోల్పోయిందని ఎవరూ నిరాశపడొద్దని.. భయపడాల్సిన అవసరం అసలే లేదని సూచించారు.
తెలంగాణ ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని పదేళ్ల పాటు మంచికే ఉపయోగించామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించామని కేసీఆర్ అన్నారు. అలాగే ఇప్పటికీ.. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అటు తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఎక్కువ రోజులు కూడా అధికారంలో ఉండదని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కానివని.. అసలు అమలు చేసే పరిస్థితే లేదని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో ఇటీవల కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కూడా కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారు పార్టీ హైకమాండ్కు సమాచారమిచ్చి కలవాలని సూచించారు. అలాగే ప్రభుత్వానికి, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలనుకున్నా.. జనం మధ్యలోనే ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని.. వారి ట్రాప్లో ఎవరూ పడొద్దని కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE