ఆమె ఓ పేదింటి ఆడబిడ్డ. తండ్రి హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు రెగ్యులర్గా చదివిన ఆమె తరువాత ఓపెన్లో డిగ్రీ చదవి, ఓయూలో పీజీ పూర్తి చేశారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే గ్రూప్ -1 కు సిద్ధమయ్యారు. తొలిప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికై.. లక్ష్యానికి పేదరికం అడ్డురాదని నిరూపించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన కుమారస్వామి-పద్మ దంపతుల కూతురు హేమలత ఇటీవల ప్రకటించిన ఎస్ఐ ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఆమె సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. తండ్రి కుమారస్వామి హమాలీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు ఓ సోదురుడు, సోదరి ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ పెరిగిన హేమలత.. పదో తరగతి వరకు గ్రామంలోనే చదివారు. తరువాత నర్సంపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. మళ్లీ కొంత కాలం తరువాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. చదువుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచేవారు.
ఈ క్రమంలోనే చెల్లెలు పెళ్లి చేసింది హేమలత. అయితే ఆమె మాత్రం జీవితంలో తన లక్ష్యం నెరవేరే వరకు పెళ్లి చేసుకోకూడదని భావించింది. అందుకే డిగ్రీ పూర్తయిన తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తిచేశారు. అప్పటి నుంచి గ్రూప్-1కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఐ ఉద్యోగాల కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడంతో దానికి సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. ఆమె విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వచ్చిన ఎస్ఐ జాబ్తో తృప్తిపడకుండా గ్రూప్-1 కు ప్రిపేర్ అవుతానని హేమలత చెప్పారు. ఐపీఎస్ కావడమే తన జీవితాశయమని పేర్కొన్నారు. ఆమె ప్రతిభకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హేమలతకు అభినందనలు తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE