ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర ‘రంజాన్’ మాసంలో పేద ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు మంత్రి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ‘రంజాన్‘ మాసంలో పేద ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ అందిస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రంజాన్ కానుకల రూపంలో దుస్తులు, ఇతర నిత్యావసరాలు అందిస్తుందని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ లోని ముస్లింల కోసం ‘షాదీముబారక్’ వంటి వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజానీకం కుల, మతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు కానుకలు అందజేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే బతుకమ్మ పండుగకు చీరెలు, క్రిస్మస్, రంజాన్ పండుగలకు కానుకలు అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నిర్మల్ నియోజకవర్గంలో 3 వేల మంది ముస్లింలకు ‘రంజాన్ తోఫా’లు అందజేస్తున్నట్లు తెలియజేశారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని రంజాన్ పండుగను జరుపుకోవాలని ముస్లింలను కోరారు. ఇఫ్తార్ పార్టీలలో భౌతిక దూరం పాటించాలని, ఫేస్ మాస్క్లు ధరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముస్లింలకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ కే. విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ