ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్-2022ను ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటుగా జరిగే గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ లో ఈ రంగంలో ఆవిష్కరణల కోసం పెట్టుబడులను పెంచడం, వారిని ప్రోత్సహించేలా వ్యవస్థాపకులు, పరిశ్రమలు, స్టార్టప్లు మరియు ఇతర వాటాదారులతో చర్చలు జరగనున్నాయి. ఈ సమ్మిట్ ప్రారంభ సెషన్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, డబ్ల్యూహెఛ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసస్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పరా మహేంద్ర, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మరియు రాయబారులు, విదేశీ ప్రముఖులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు మరియు ఇతర ముఖ్య వాటాదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆయుష్ ఔషధాలు, సప్లిమెంట్లు మరియు సౌందర్య సాధనాల ఉత్పత్తిలో ఇప్పటికే అపూర్వమైన వృద్ధిని చూస్తున్నామన్నారు. 2014లో ఆయుష్ రంగం 3 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటే, నేడు అది 18 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు గత సంవత్సరాల్లో అపూర్వమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. దేశంలో ఆయుష్ ఉత్పత్తులకు ప్రత్యేక ఆయుష్ గుర్తుగా ఏర్పాటు చేస్తామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులపై విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్ ఉత్పత్తుల ప్రమోషన్, పరిశోధన మరియు తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ పార్కుల నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని, అలాగే హెర్బల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ల ఉత్పత్తిదారులకు గొప్పగా ఉపయోగపడే ‘ఆయుష్ ఆహార్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొస్తామని చెప్పారు. ఇక ఆయుష్ థెరపీని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశానికి రావాలనుకునే విదేశీ పౌరుల కోసం త్వరలో ప్రత్యేక “ఆయుష్ వీసా” కేటగిరీని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
మరోవైపు గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ ప్రారంభ సెషన్ లో డబ్ల్యూహెఛ్ఓ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ, ఆయుష్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, 2014 నుండి సంవత్సరానికి 17 శాతం చొప్పున పెరుగుతోందని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆయుష్ పరిశ్రమ 23 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రామాణిక యాదృచ్ఛిక ట్రయల్స్ సాధ్యం కానప్పుడు లేదా చేపట్టడం కష్టంగా ఉన్న సందర్భాల్లో, సాంప్రదాయ వైద్య విధానాల ప్రభావాన్ని డాక్యుమెంట్ చేయడానికి మేము వినూత్న అధ్యయన డిజైన్లను మరియు కృత్రిమ మేధస్సును ఉపయోగించడాన్ని అన్వేషిస్తున్నామని చెప్పారు. మెరుగైన ఆరోగ్య ఫలితాలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు మొత్తం ప్రభావాన్ని ప్రోత్సహించడానికి సాంప్రదాయ ఔషధం యొక్క సాక్ష్యాధారాలను బలోపేతం చేయడం ద్వారా కమ్యూనిటీలు దాని వినియోగాన్ని సులభతరం చేయాలి” అని డా.టెడ్రోస్ అథనామ్ కోరారు. మరోవైపు మంగళవారం నాడు ప్రధాని మోదీ గుజరాత్ లోని జామ్నగర్లో డబ్ల్యూహెఛ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ