తెలంగాణలో రాజకీయాలలో మరోసారి సంచలనం చేటుచేసుకోనుంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను బీజేపీలోకి చేర్చుకుంటోంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరిగేలా, దానిలో విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ కూడా అయినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పటినుంచి పార్టీలోని పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉంటున్న విషయం తెలిసిందే. వీరిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారని గత కొద్దిరోజులుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా రాజగోపాల్ రెడ్డి తాజాగా రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లతో కీలక చర్చలు జరపడం విశేషం. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.
కాగా దీనిపై బండి సంజయ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డితో భేటీ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారని స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఖమ్మం, నల్లగొండ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. మహాబూబ్ నగర్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీకి రాష్ట్రంలో ఎంత ఆదరణ ఉందో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ కూడా చూసిందని, దీంతో టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్ని పార్టీల నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక, మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైతే అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని సంజయ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చెరనున్నారన్న వార్తలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ