విద్యాసంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని మానవాళికి తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన జీవన్ లైట్-స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ను గురువారం నాడు గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో దేశానికి సహాయపడే ఆవిష్కరణలు, కొత్త స్వదేశీ సాంకేతికతలతో ముందుకు రావడంలో హైదరాబాద్ ఐఐటి విద్యార్థుల ప్రయత్నాలను ప్రశంసించారు.
మెడికల్ ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడ్డ కోవిడ్ రెండవ దశ రోజులను గుర్తుచేసుకుంటూ ఆక్సిజన్ సరఫరా ఉన్న బెడ్ను కోరుతూ వివిధ వర్గాల ప్రజల భయంతో ఫోన్ చేసేవారని తెలిపారు. “స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ వంటి ఆవిష్కరణలు డాక్టర్గా, గవర్నర్గా నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి, ఎందుకంటే ఇవి చాలా విలువైన జీవితాలను రక్షించడంలో మాకు సహాయపడే రకమైన ఆవిష్కరణలు” అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్వావలంబనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ప్రాధాన్యత, చొరవ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల కృషి వల్ల అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశం మహమ్మారిని మెరుగ్గా ఎదుర్కొందని గవర్నర్ అన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో స్వదేశీ వ్యాక్సిన్లు, మందులు, వైద్య సాంకేతికతలు, పరికరాలతో ముందుకు వస్తున్నందుకు మన దేశంలోని శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. యువ ఆవిష్కర్తలను, పరిశోధనలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నందుకు హైదరాబాద్ ఐఐటీను డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీష్ రెడ్డి, ఐఐటి-హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి, ఐఐటి-హైదరాబాద్ ఛైర్మన్ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ