తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. అలాగే 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ.. వారికి కేటాయించబోయే శాఖలపై ఉత్కంఠ నెలకొంది. అయితే శుక్రవారం ఢిల్లీకి వెళ్లిని సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ హైకమాండ్తో సుదీర్ఘ చర్చలు జరిపి మంత్రులకు శాఖలను ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రులకు కేటాయించిన శాఖలను రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
సీఎం తర్వాత పోర్టుఫోలియోగా భావించే ఆర్థిక శాఖను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించారు. అలాగే ఇంధన శాఖను కూడా విక్రమార్కకే కట్టబెట్టారు. సీతక్కకు పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, చేనేత శాఖలను ఇచ్చారు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక శాఖలను.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి పారుదల, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.
అలాగే దామోదర రాజనర్సింహకు వైద్యారోగ్య శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖలను.. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు శాసనసభ వ్యవహారాల శాఖతో పాటు ఐటీ మరియు పరిశ్రమల శాఖను కట్టబెట్టారు. పొంగులేటి శ్రీనివస్ రెడ్డికి.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖను, పొన్నం ప్రభాకర్కు రవాణా, బీసీ సంక్షేమ శాఖను.. కొండా సురేఖకు అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖలను కట్టబెట్టారు. ఇక ప్రస్తుతానికి హోం శాఖను రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు.
ఇకపోతే మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకొనే అవకాశం ఉంది. దీనిపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరిపారు. అయితే దీనిపై మరికొద్దిరోజుల పాటు వేచి చూడాలని హైకమాండ్ రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY