తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్రభారతిలో ఘనంగా అభినందన సభను జరిపి సత్కరించుకుందామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. “నాటు నాటు” పాటతో తెలుగు పల్లీయుల పదబంధాలను ఉపయోగించి, సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించతగిందని పేర్కొన్నారు. బుధవారం నాడు సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన చంద్రబోస్ అభినందన సభ సన్నాహ సమావేశంలో తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందచారి, తెలంగాణ సాహితీ సహకార కార్యదర్శి ఎన్కె సలీమా, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, కాళోజి అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారి తెలుగు గీతానికి ఈ అవార్డు రావడం మనమందరం ఆనందించాల్సిన విషయమన్నారు. తెలుగు ప్రజలందరూ సంబరపడటానికి కారకుడైన చంద్రబోస్ కు, ఆ పాటకు సంగీతం, నృత్యం, దర్శకత్వం వహించిన వారందరికీ హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపారు. ఈ సందర్భంగా తెలుగు సినీగేయ సాహిత్యానికి ఇంతటి గౌరవాన్ని తీసుకువచ్చిన రచయిత చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కవులు, రచయితలు ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా జూలూరు కోరారు. తెలుగు పాటను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపిన పాట రచయిత, మన తెలంగాణ గర్వించదగ్గ సినీగేయకవి చంద్రబోస్ ఆస్కార్ అవార్డు పొందడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.
ఈ అభినందన సభ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ గ్రంథాలయ పరిషత్, తెలంగాణ సాహితి, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం, హైదరాబాద్ కవుల వేదిక, అక్షర యాన్, కవి సంగమం, పాత నగరం రచయితల సంఘం, హైదరాబాదు ఓల్డ్ సిటీ రైటర్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, చినుకు, పురమి సాహిత్య వేదిక, భారత జాగృతి, పాత నగర కవుల వేదిక, దుందుభి సాహిత్య వేదిక, తేజ సాహిత్య సేవా సంస్థ, యువ సాహితీ, ధార్మిక జన మోర్చా తెలంగాణ, తదితర సంఘాలు పాలుపంచుకుంటాయని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE