మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే కేసులపై బుధవారం కమిషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కమీషన్ భావిస్తోందని చైర్ పర్సన్ వెల్లడించారు.
హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో జరిగిన కమిషన్ సర్వ సభ్య సమావేశానికి ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించగా సభ్యులు షాహిన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీ భాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణే మన ప్రధాన ఎజెండాగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. జిల్లాల వారిగా తరచూ సమావేశాలు నిర్వహించి మహిళా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికారులను సమన్వయపరచాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వ సభ్య సమావేశంలో సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్యను కమీషన్ తీవ్రంగా ఖండిస్తు నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళల పట్ల అనుచిత ప్రవర్తనను నిరోధించే సెక్షన్లను కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ, తల్లీబిడ్డల సంక్షేమానికి వైద్య శాఖ చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. ఇటీవల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ నంబరుకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తుల వివాదాల, కోర్టు కేసుల పట్ల మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని, అవి కమిషన్ పరిధిలోకి రావని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ