ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ పోతోంది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని సీఎం రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే మహాలక్ష్మీ పథకంతో పాటు.. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత పథకాన్ని రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోనే రెండు పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు.
అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన మూడు బస్సులను మంత్రులు సీతక్క, కొండా సురేఖ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కొండా సురేఖలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బస్సులో అసెంబ్లీ నుంచి నక్లెస్ రోడ్డు వరకు ప్రయాణించారు. ఇక మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో.. ఈరోజు మధ్యాహ్నం నుంచి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఫ్రీగా తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు.
ఈ సందర్భంగ.. ఇవాళ తెలంగాణ ప్రజలకు పండుగ రోజని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 9 డిసెంబర్ 2009న తెలంగాణ ప్రక్రియ ప్రారంభయిందని.. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం సోనియా గాంధీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చారని.. అందులో రెండు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ