దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పార్టీ ఏర్పాటుకు సంబంధించి మరో ముందడుగు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని పార్టీ సమన్వయకర్త వాడుక రాజగోపాల్ తెలిపారు. పార్టీ పేరుపై వైఎస్ విజయమ్మకి ఎటువంటి అభ్యంతరం లేదని, వారు ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగిందని చెప్పారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లో పార్టీ పేరుపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని ఏప్రిల్ 30వ తేదీనే కోరారని, ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రక్రియ పూర్తయిందని అనుకుంటున్నామన్నారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ పుట్టినరోజు అయిన జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని, ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించినట్టు వాడుక రాజగోపాల్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ