హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇటీవలే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. అయితే సమయం తక్కువ ఉండడం, ఇతరత్రా ఏర్పాట్ల దృష్ట్యా నిమజ్జనం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపి, హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేవలం ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ముందుగా జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం 22 చిన్న చెరువులను ప్రభుత్వం సిద్ధం చేసినప్పటికీ, అందులో పెద్ద విగ్రహాల నిమజ్జనం సాధ్యంకాదని కోర్టుకు తెలిపారు. అలాగే హుస్సేన్సాగర్లో నిమజ్జన, కాలుష్య నివారణపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు గణేష్ నిమజ్జనంకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబరాలు జరిపింది. భక్తుల మనోభావాలను గౌరవించి అనుమతులు ఇచ్చిన సుప్రీంకోర్టుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ