దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బుధవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించారు. వెల్దుర్తి మండలంలోని శేరిల్లా గ్రామంలో ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా కూడా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. “ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. ఈ రోజు అవే ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానం. 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వయసు పెరిగిపోవడంతో ఉద్యోగాలు రాక ఎంతో మంది చనిపోతున్నారు” అని షర్మిల అన్నారు. వెంటనే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్నికోరారు.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా తూప్రాన్ మండలం నాగుల పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికూడా షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవలే కరోనాతో ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించి, వారికి సాయం అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ