కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వాయిదా నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ మార్చ్ 15, ఆదివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ తో భేటీ అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మరో సంవత్సరం పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించడం అవసరమని ఆయన అన్నారు. అలాగే తిరుపతి, విజయవాడలో ఉన్న ల్యాబ్ లకు అదనంగా కాకినాడలో ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రాన్ని కోరామని తెలిపారు.
కరోనా వైరస్ కారణంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితి లేకపోయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్దేశిపూర్వకంగా వ్యవహరించడం రాష్ట్రానికి నష్టం చేస్తోందని, కేంద్రం నుండి రావాల్సిన రూ. 5000కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదముందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలు వాయిదా వేయడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని సీఎం పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేసే క్రమంలో కనీసం సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖకార్యదర్శులను సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ పై సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో రమేశ్ కుమార్ విచక్షణ కోల్పోయి మాట్లాడారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రమేశ్కుమార్ ఈసీగా నియమితులయ్యారని చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను మా ప్రభుత్వం నియమించలేదు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)కు కుల, మతం, ప్రాంతం అనే స్వార్థాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్ఈసీ పదవిలోకి తీసుకొచ్చారని, ఎవరో రాసిపంపిన ఆర్డర్లును ఎస్ఈసీ చదివి వినిపిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఇటీవల విచక్షణాధికారం పేరుతో కొత్తగా ఏదేదో చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్ఈసీ ఏ అధికారంతో ఏకపక్షంగా తప్పిస్తారని ప్రశ్నించారు. ప్రజల చేత 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోబడగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఎక్కువ అధికారాలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పది రోజుల్లో పూర్తయ్యే స్థానిక ఎన్నికలు పక్రియను ఏకపక్షంగా వాయిదా వేయడం తప్పుడు నిర్ణయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ జోరు చూసి టీడీపీకి భయం పట్టుకుందని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కొత్త కాదని, 10 వేల చోట్లకు పైగా ఎన్నికలు జరుగుతుంటే కేవలం 43 చోట్లే చిన్న చిన్న సంఘటనలు జరిగాయన్నారు. అక్కడ కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించకుండా నిబద్ధతతో వ్యవహరించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
[subscribe]