ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు నేతలు పేర్కొంటున్నారు. ఈక్రమంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటోన్న రాజకీయ నాయకులకు ఇటీవల సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. రాజకీయ నాయకులపై నమోదైన క్రమినల్ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల దాఖలైన ఓ పిటిషన్పై విచారణ చేపట్టి ధర్మాసనం ఈ విధంగా తీర్పు వెలువరించింది. మరో మూడు, నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. సుప్రీం ఈ విధంగా తీర్పునివ్వడం సంచలనంగా మారింది.
అయితే సుప్రీం నిర్ణయంతో ఏపీ నేతల్లో గుబులు మొదలయింది. ఎందుకంటే ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసేందుకు ఏపీ హైకోర్టు చకచకా అడుగులేస్తోంది. త్వరలోనే రాజకీయ నాయకుల కేసులు విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది. ఈ మేరకు ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులపై విచారణ పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను హైకోర్టు.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును హైకోర్టు కోరింది.
అయితే వెంటనే ప్రజాప్రతినిధుల కోర్టు హైకోర్టుకు నివేదికను అందించింది. మొత్తం 78 మంది రాజకీయ నాయకులపై నమోదైన కేసుల విచారణ పెండింగ్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. దీంతో త్వరలోనే ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసి ఆ కేసులను విచారించే దిశగా ఏపీ హైకోర్టు ముందుకు అడుగులేస్తోంది. అయితే ఎన్నికల ముంగిట కేసుల వ్యవహారం ముందుకు రావడంతో నేతల్లో కొత్త గుబులు మొదలయింది. ఒక వేళ నేరం రుజువై.. శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకపోవడంతో రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే కొందరు నేతలు ఎన్నికల కోసం గ్రౌండ్ రెడీ చేసేసుకున్నారు. ఈ సమయంలో సుప్రీం తీర్పుతో వారికి కొత్త చిక్కొచ్చి పడినట్లు అయింది. ప్రస్తుతం ప్రత్యేక బెంచ్ జరపబోయే విచారణలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 78 మందిలో ఎంత మంది నేరాలు రుజువవుతాయి..? ఎంత మంది జైలుకెళ్తారు..? క్లీన్ చీట్ ఎంత మందికి దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ