త్వరలోనే ఏపీ ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈసీ వడివడిగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జిలను మార్చింది. పోటీకి సిద్ధం కావాలని మెజార్టీ అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రెండో సారి అధికారం కోసం విస్తృతంగా ప్రజల్లో తిరగాలని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఎన్నికలకు సిద్దం అవుతోంది. నారా చంద్రబాబు నాయుడు సభలు, సమావేశాల ద్వారా ప్రజలు, నేతల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పొత్తు పార్టీ జనసేన కూడా తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతూ, ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. పక్క రాష్ట్రం తెలంగాణలో ఎదురైన అనుభవంతో ఏపీలో తమ బలాబలాలపై అంచనా వేసుకునే పనిలో నిమగ్నమైంది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓ దశలో అధికార పక్షానికి ఢీ అంటే ఢీ కొట్టిన పార్టీ ఆ తర్వాత నెమ్మదించింది. కనీసం 30 సీట్లు ఆశించినా కేవలం ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. గతం కంటే ఓట్లను, సీట్లను పొందినా ఫలితాలు శ్రేణులను నిరాశపరిచాయి. అయితే, తెలంగాణలో ఉన్నంత బలంగా ఏపీలో బీజేపీ లేదు. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై సమాలోచనలు చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తే కాసిన్ని ఓట్లు పెరగొచ్చేమోగానీ సీట్లు రావడం కష్టమే అన్న అభిప్రాయంలో ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలోనూ నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది.. జనం ఎటు మొగ్గు చూపుతున్నారు.. టీడీపీ-జనసేన కలిసి వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి.. అనే అంశాలపై చర్చ నేతలు చర్చించారు.
మెజారిటీ నేతలు టీడీపీ-జనసేనతో బీజేపీ జట్టుకడితేనే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయ పడుతున్నట్లు తెలిసింది. దీనిపై భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పొత్తుతో పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లే పదవులు పొందుతారు.. ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ల పరిస్థితి మాత్రం అలాగే ఉంటుందని కొందరు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులను తెలపాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ చీఫ్ పురందేశ్వరి ఇక్కడి పరిస్థితులను మనందరం చెబుదాం.. తర్వాత ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు మనం సిద్ధంగా ఉండాలి అని పార్టీ నాయకులకు చెప్పారు. పోటీకి సిద్ధమంటూ ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించగా.. మన ప్రత్యర్థి ఎవరో స్పష్టంగా చెప్పాలని వాకాటి నారాయణరెడ్డి అన్నట్లు తెలిసింది.
అయితే.. తెలంగాణ ఫలితాలను బేరీజు వేసుకుని.. ఏపీలో వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ ఎస్ – బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం బాగా జరిగింది. ఏపీలోనూ ఆ పరిస్థితి రాకుండా వైసీపీ – బీజేపీ ఒక్కటేననే భావన ప్రజల్లో పోగొట్టుకునే పనిలో బీజేపీ ఉంది. లేకుంటే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీపైనా ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. తమిళనాడులో ఇసుక అక్రమాలు, ఢిల్లీలో లిక్కర్ లాబీపై చర్యలు తీసుకున్న కేంద్రం.. ఏపీలో ఆ రెండింటిపై విచారణకు వేయకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంలో నేతలు ఉన్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని కోర్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.
దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంతగా ఏం బాగాలేదన్న అభిప్రాయం సీనియర్లలో ఉంది. ఈ క్రమంలో పార్టీ పుంజుకోవడానికి త్వరలోనే పాదయాత్ర చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అలాగే.. వైసీపీలో కీలక నేతలు పార్టీ వీడుతున్న క్రమంలో వారిని బీజేపీలోకి ఆకర్షించేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పక్కా ప్రణాళికలతో ఈసారి ఏపీ ఎన్నికలకు వెళ్లేలా అధిష్ఠానం కార్యచరణ రూపొందిస్తోంది. దాంతో పాటు టీడీపీ, జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నికలు సమీపించే వేళ రాజకీయాలు ఎలా మారతాయో మరి..!
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE