ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ అరెస్ట్ వ్యవహారంపై చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. దీనిపై వివరాలు తెలిపేందుకు ఆయన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో మాజీ మంత్రి నారాయణ పాత్రపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నారాయణ సంస్థల ఆధ్వర్యంలోని స్కూళ్లలో అడ్మిషన్లను పెంచుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే పేపర్ను లీక్ చేశారని వెల్లడించారు. గత నెల 27న టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ జరగగా, దీనిపై చిత్తూరు పీఎస్లో ఒక కేసు నమోదయిందని తెలిపారు. ఈ కేసుకి సంబంధించి ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు.
పరీక్షల సెంటర్ల లోని ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగా తెలుసుకుని, ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా నారాయణ స్కూల్ హెడ్ ఆఫీస్ కు పంపించి ఆన్సర్స్ తయారు చేసి విద్యార్థులతో మాల్ ప్రాక్టీస్ చేసేందుకు పకడ్బందీగా ఒక పథకాన్ని రూపొందించి అమలు చేశారని పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేశామని, వారందరూ ప్రస్తుతం కానీ, గతంలో కానీ నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వారేనని వెల్లడించారు. వారిని విచారించగా మాజీ మంత్రి నారాయణ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయని, అందుకే ప్రత్యేకంగా ఒక టీముని హైదరాబాద్ పంపించి ఆయనను ట్రేస్ చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని, త్వరలోనే కోర్ట్ అనుమతితో విచారిస్తామని ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ