ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే నెరవేస్తున్నామని చెప్పారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం హయాంలో ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేవారని, ఇప్పుడు ఆ మొత్తాన్ని తమ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచినట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గత బడ్జెట్లో మౌలికసదుపాయాల నిమిత్తం
మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించామని చెప్పారు.
అదేవిధంగా మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మత్స్యకారులకు సంబంధించిన మరపడవలు,ఇంజను కలిగిన తెప్పలకు డీజిల్పై అందించే రాయితీని రూ.9 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ముందుగా ఐ.పోలవరం మండలంలోని పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య నిర్మించిన వైఎస్సార్ వారధి వంతెనను సీఎం ప్రారంభించారు. 11 గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రయోజనం కల్గించే ఈ వంతెనను రూ.35 కోట్లతో నిర్మించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
[subscribe]