ఏపీ ఉద్యోగులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలి వస్తున్నారు. గత కొద్ధి రోజులుగా రివర్స్ పీఆర్సీ పై ఉద్యమిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయటానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా.. వేలాదిగా ఉద్యోగులు విజయవాడ నగరానికి పయనమయ్యారు. అయితే, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఉద్యోగుల సెలవులు రద్దుచేసి, గురువారం డ్యూటీకి రావాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులు కొన్నిచోట్ల అరెస్టులు చేస్తున్నారు.. నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఉపాధ్యాయుల ఇళ్లకు హెచ్చరిక నోటీసులు అంటించారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ఉద్యోగులు, నాయకులు ఉద్యుక్తులవుతున్నారు. కనీసం రెండు, మూడు లక్షలమంది విజయవాడకు రావడానికి ఎవరి ప్రయాణ ఏర్పాట్లు వారు చేసుకున్నట్టు పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపైనా ప్రభుత్వం నిఘా పెట్టింది. మరోవైపు పోలీస్ వ్యూహాలు, వలయాలను చేధించుకుంటూ ఇప్పటికే పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఉద్యోగులు సంఘ నాయకులు విజయవాడ చేరుకున్నారు. అయితే, ఇలా చేరుకుంటున్న వారిని పసిగట్టేందుకు నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు పోలీసులు. సభ జరిగే విజయవాడ లోని బీఆర్టీఎస్ రోడ్డులోనే వంద సీసీ కెమెరాలను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు ఉన్నాయని పోలీసులు గుర్తుచేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF