ప్రస్తుత సమయంలో నాగార్జునసాగర్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. వేసవి ఇప్పుడే మొదలయినందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను వెంటనే అడ్డుకోవాలని ఏపీ సర్కార్ కోరింది. సాగర్ నుంచి వదిలే జలాలు వృథాగా సముద్రంలోకి పోతాయని, దీనికి బదులుగా త్రాగునీటి అవసరాలకోసం వినియోగించాలని లేఖలో తెలిపింది. నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి కోసం భారీగా నీటిని వృథా చేయకుండా చూడాలని కోరింది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ వేసవిలో త్రాగునీటి అవసరాల కోసం సాగర్పైనే ఆధారపడతాయని, విద్యుదుత్పత్తి కోసం విలువైన నీటిని వృథా చేస్తే వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని బోర్డుకు తెలిపింది. దిగువన కృష్ణా డెల్టా సాగునీరు, తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఏపీ తరఫునుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీలకు పైగా నిల్వ ఉన్నాయని, మరోవైపు ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉందని వెల్లడించింది. ఇలాంటప్పుడు సాగర్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయటం వలన పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి ఆ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వస్తుందని బోర్డుకు తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ