విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే గ్యాస్ లీక్ జరిగిందని, దీని ఫలితంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా చాలా మంది అస్వస్థతకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను ప్రభావితం చేసిన ఈ దుర్ఘటనకు పరిశ్రమ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు.
ఇలాంటి కంపెనీలు బాధ్యతగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించి, ఉపశమనం కల్పించడంపైనే దృష్టి సారించామని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, చుట్టూ పక్కల గ్రామాల్లో ప్రజల తరలింపు జరుగుతుందని, పౌరులు భయపడకుండా, అధికారులతో సహకరించాలని మంత్రి మేకపాటి విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu