దేశంలో ఉన్నత విద్యలో సంస్కరణల్లో భాగంగా మరో నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై దేశంలో విద్యార్థులు ఒకేసారిగా రెండు డిగ్రీ కోర్సులు చేసేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏప్రిల్ 12, మంగళవారం నాడు ప్రకటించింది. ఒకే స్థాయి డిగ్రీ కోర్సులను ఒకేసారిగా ఫుల్ టైమ్ లో చేసేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని యూజీసీ భావిస్తుండగా, ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి నిబంధనలతో యూజీసీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తుంది.
యూజీసీ చైర్పర్సన్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి అనుగుణంగా ఈ సంస్కరణ తీసుకువస్తున్నామని తెలిపారు. సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, స్పోర్ట్స్ సహా పలు డొమైన్లలో మల్టీడిసిప్లినారిటీ మరియు సమగ్ర విద్యను అందించడానికి ఈ విధానం అమలుచేస్తామని అన్నారు. ఒకేసారిగా రెండు డిగ్రీలు చేయాలనుకునేవారికి ఇప్పుడు అవకాశం రాబోతుందని, అయితే అది విద్యార్థుల ఛాయిస్ మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులు ఎంచుకునే కోర్సులు ఒకేస్థాయివి అయి ఉండాలని, రెండు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) లేదా రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) లేదా రెండు డిప్లొమా డిగ్రీలు అయి ఉండాలన్నారు.
మరోవైపు రెండు డిగ్రీ కోర్సులను ఒకేసారిగా ఫిజికల్ మోడ్లో లేదా ఒక డిగ్రీని ఫిజికల్ మోడ్లో మరియు మరొకదాన్ని ఆన్లైన్/డిస్టెన్స్ మోడ్లో లేదా రెండింటిని ఒకేసారిగా ఆన్లైన్/డిస్టెన్స్ మోడ్ లో పూర్తిచేసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. అయితే ఈ విధానం యూజీసీ అనుబంధిత నాన్ టెక్నికల్ కోర్సులకు మాత్రమే వర్తించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు సంబంధిత యూనివర్సిటీ అనుమతి ఇస్తే రెండో డిగ్రీని కూడా అదే యూనివర్సిటీ లేదా అదే కాలేజీలో కొనసాగించవచ్చని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ